వైఎస్ఆర్సీపీలో చేరిన అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా చాలామంది నేతల్లానే వెళుతూ వెళుతూ పాత పార్టీ అధినాయకత్వంపై విమర్శలు చేశారు. కానీ అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమైయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య విభేదాలు రావడానికి కారణం… టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే అవినీతి భాగోతాన్ని ప్రధాని కార్యాలయం గుర్తించి విచారణకు ఆదేశించడమే అన్నారు అవంతి. అయితే ఆ ఎమ్మెల్యే ఎవరనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.
ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎవరన్న విషయంపై చర్చ ప్రారంభమైంది. మహారాష్ట్రలో ఇరిగేషన్ కాంట్రాక్టుల విషయంలో అక్రమాలకు పాల్పడిన వ్యవహారంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిపై ఇప్పటికే పూణే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఆయన అరెస్టు కూడా తథ్యమన్న వార్తలు వచ్చాయి. దీంతో అవంతి ప్రస్తావించిన ఆ ఎమ్మెల్యే బొల్లినేని రామారావే అయి ఉంటారన్న వాదన వినిపిస్తోంది.
రామారావు తప్ప మరే ఎమ్మెల్యే కూడా ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకునేంత అక్రమాల ఆరోపణలు ఎదుర్కోనలేదు. ఏదేమైనా మొత్తానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఎన్డీయే నుంచి బయటికొచ్చామంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారానికి అవంతి పుల్స్టాప్ పెట్టారు. అంతేగాక ఈ వ్యాఖ్యలతో విపక్షాలకు మరో అస్త్రం దొరికినట్టైంది.