ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు విమర్శలు గుప్పించారు. కేంద్రంపై దాడి చేయడమే బాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అదే విధంగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో భయంకరమైన అవినీతి జరుగుతోందని బీజేపీ నేత సోము వీర్రాజు ఆరోపించారు. ఆయన శుక్రవారం కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు.
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 80 యంత్రాలు పనిచేయడం లేదని, ఈ యంత్రాల మెయింటెనెన్స్ బాధ్యతలు టీబీఎస్ సంస్థకు కాంట్రాక్ట్ గా ఇచ్చారని, మొబిలైజేషన్ ద్వారా 103 కోట్లు, బిల్లుల రూపంలో రూ.45 కోట్లు ఇచ్చారని అన్నారు. ఆ యంత్రాలు పనిచేయకున్నప్పటికీ సీఎం డ్యాష్ బోర్డులో పనిచేస్తున్నట్టు చూపిస్తోందని, టీబీఎస్ సంస్థ కాంట్రాక్టును తక్షణం రద్దు చేయాలని విమర్శించారు.
క్షేత్ర స్థాయిలో రాష్ట్రంలో భయంకరమైన అవినీతి జరుగుతోందని, టాయిలెట్స్ నిర్మాణం, ఎన్ ఆర్జీఎస్ లో జరుగుతున్న అవినీతిని బయటపెడతామని అన్నారు. రాష్ట్రంలో అవినీతి చూసి విదేశీ సంస్థలు రావడం లేదని, ముఖ్యంగా విదేశీ బ్యాంకులు అప్పులివ్వడం లేదని ఆరోపించారు.