తమ విధులకు ఆటంకం కలిగిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తా అంటూ మంత్రులను ఉద్దేశించి ఆగ్రహంతో ఊగిపోతున్న ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహారంతో కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఏకగ్రీవాల గురించి మీడియా ప్రకటనలపై అధికారులకు నోటీసులు జారీ చేసిన బాబు విషయంలో కూడా అదే తరహాలో దూకుడుగా ఉంటారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ పంచాయతీలకు పంచసూత్రాలు అంటూ చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోనే ఇందుకు కారణం.
ఈ నేపథ్యంలో అధికార పార్టీ ప్రతినిధులు, నేతలకు నిమ్మగడ్డ మరోసారి టార్గెట్ అయ్యారు. స్థానిక ఎన్నికల్లో మేనిఫెస్టో విడుదల చేయడం ఏమిటని బాబను విమర్శిస్తూనే, నిక్కచ్చిగా వ్యవహరిస్తానని చెప్పుకునే నిమ్మగడ్డ, టీడీపీ గుర్తింపును రద్దు చేస్తారా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఓవైపు పంచాయతీ ఎన్నికలకు పార్టీలకు సంబంధం లేదని చెబుతూనే ఉన్నా.. చంద్రబాబు పల్లె ప్రగతి కి పంచసూత్రాలు అంటూ ఓ మేనిఫెస్టోను ప్రింట్ చేయించారు.
ఇంకేముంది అప్పటి నుంచి నెటిజన్లు ఆయనపై జోకులు వేయడం మొదలుపెట్టారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి, ఆ తర్వాత అదే పార్టీని నిట్టనిలువునా ముంచిన మేనిఫెస్టో వ్యవహారంతో బాబుకు బుద్ధి వచ్చిందనుకుంటే, మళ్లీ ఇప్పుడు కొత్తరాగం ఎత్తుకోవడం భలే బాగుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. 2014లో ఇచ్చిన హామీల్లో పూర్తిగా విఫలం కావడంతో టీడీపీకి 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బాబు చేసిన పనితో నిమ్మగడ్డకు నిజాయితీ నిరూపించుకునే అవకాశం వచ్చిందని, ఆయన పార్టీపై చర్యలు తీసుకుని, అధికార పార్టీ విమర్శలను తిప్పికొట్టాలంటూ నెటిజన్లు వ్యంగ్యధోరణితో కూడిన సలహాలు ఇస్తున్నారు. మరి ఎస్ఈసీ ఏం చేస్తారో చూడాలి!