మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీకీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బాబు తెరలేపిన ఆపరేషన్ ఆకర్శ్ వికర్శ్గా మారుతోంది. వైసీపీ నుంచి బలమైన నేతలను లాక్కోవాలని చూస్తున్న బాబు ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీలనుంచి అధికార పార్టీలోకి వలసలు ఉండటం సాధారణం. కాని ఏపీలో మాత్రం అధికార పార్టీనుంచి ప్రతిపక్షపార్టీ వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీనుంచి వైసీపీలోకి జంప్ అవుతున్నారు.
ఎన్నికల సమయానికి వైసీపీని దెబ్బ కొట్టాలని బాబు వ్యూహాలు అమలు చేస్తున్నారు. మరో సారి ఆపరేషన్ ఆకర్శ్ద్వారా వైసీపీ నేతలకు గాలం వేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్శ్ ఏమో గాని సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితుల్లో బాబు ఉన్నారు. వారం రోజుల క్రితం రాజంపేట టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మళ్లికార్జున్ రెడ్డి జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
ఆ షాక్ నుంచి బాబు తేరుకోక ముందే ఇప్పుడు తాజాగా మరో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం అయ్యింది. త్వరలోనే ఆయన లోటస్ పాండ్లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జగన్తో ఆమంచి తన ఫ్యామిలీతో భేటీ అవుతున్నారు.
2014 ఎన్నికల్లో చీరాలనుంచి స్వతంత్ర అభ్యర్తిగా గెలిచిన ఆమంచి టీడీపీలోకి జంప్ అయ్యారు. అయితే టీడీపీలో తగిన ప్రాధాన్యాత లేకపోవడంతో గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మొదట జనసేనలో చేరాలనుకున్న ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరో వైపు బాబునుంచి టికెట్ విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రజాసంకల్ప యాత్రలో ప్రజల నుంచి జగన్కు వచ్చిన స్పందన తెలిసిందే. దాంతో పాటు అన్ని జాతీయ సర్వేల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని తేల్చడంతో వైసీపీ కండువా కప్పుకొనేందుకు సిద్దమయ్యారు. మరో వైపు వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలో కూడా ఆమంచికి సానుకూలంగా ఫలితాలు రావడంతో పాటు స్థానికంగా ప్రజల్లో మంచి పేరు ఉండటంతో ఆమంచి పార్టీలో చేరేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
రేపో ఎల్లుండో జగన్తో భేటీ అవుతారనే సమాచారం పార్టీ వర్గాలనుంచి వినిపిస్తోంది. భేటీ అనంతరం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. టీడీపీలో ఉన్న బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడంద్వారా సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావాలని జగన్ వ్యూహాలు అమలు చేస్తున్నారు.