ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవు మత్స్యకారుల మధ్య జరిగిన రగడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో మత్స్యకారుల మధ్య ఘర్షణలు చిచ్చురేపాయి. సాక్షాత్తూ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ సమక్షంలో ఆమంచి కృష్ణమోహన్-కరణం బలరాం వర్గీయులు దాడులకు తెగబడటంతో పలువురికి గాయాలయ్యాయి. సముద్రంలో వేటాడే వలల విషయమై వివాదం నేపథ్యంలో ఈ నెల 11న చీరాల మండలం వాడరేవుపై వేటపాలెం మండలం కఠారివారిపాలెం మత్స్యకారులు దాడిచేశారు. ఈ సందర్భంగా వాడరేవుకు చెందిన 13 మంది మత్స్యకారులు గాయపడ్డారు. వీరిని పరామర్శించడంతోపాటు, రెండు గ్రామాల వారితో మాట్లాడేందుకు మోపిదేవి వెంకటరమణ సోమవారం చీరాలకు వెళ్లారు.
ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ నేతలు ఆమంచి కృష్ణమోహన్, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, పోతుల సునీత, కరణం వెంకటేష్, డాక్టర్ వరికూటి అమృతపాణి తదితరులతో కలసి స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారులను పరామర్శించారు. ఆ తరువాత మోపిదేవి కాన్వాయ్ వాడరేవు వెళుతున్న సమయంలో ప్రసాదనగరం దాటిన తరువాత ఒకరి వాహనాలు ఒకరు అధిగమించే సమయంలో బలరాం, ఆమంచి వర్గాల మధ్య వివాదం తలెత్తి, కొట్లాటకు దారితీసింది.
ఆమంచిపై తీవ్ర ఆరోపణలు
ఈ దాడిలోజాన్పేటకు చెందిన ఆమంచి వర్గీయులు కనపర్తి బజ్జిబాబు, హరిస్పేటకు చెందిన కె.సతీష్ గాయపడ్డారు. ఇక బలరాం వర్గీయుడు ఎన్ వివాజీకి గాయాలయ్యాయి. ఏఎస్పి బి.రవిచంద్ర ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లాలోని పలు పోలీస్ స్టషన్లలోని సిబ్బంది సహా ప్రత్యేక బలగాలను మోహరించగా.. డీఐసీ త్రివిక్మ వర్మ చీరాల చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. వాడరేపు గ్రామంలో పర్యటించిన ఎంపీ మోపిదేవి వెంకటరమణకు స్థానికులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమంచి కృష్ణమోహన్ తమపై దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమంచి డౌన్డౌన్ అంటూ వాడరేవు గ్రామ ప్రజలు నినదించారు. ఆయన సమక్షంలోనే తమపై దాడులు జరిగాయని పలువురు మహిళలు ఆరోపించారు. ఇటువంటి ఘటనలతో చీరాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతోందని, ఐకమత్యంగా ఉండి ఆర్థికంగా ఎదిగేలా కృషి చేయాలని, శాంతియుతంగా ఉండాలని ఎంపీ మోపిదేవి కోరారు. చెప్పుడు మాటలతో ఇరు వర్గాల మధ్య వివాదాలకు చోటివ్వద్దని హితవు పలికారు. తదనంతరం కటారివారిపాలెం గ్రామ పెద్దలతో మాట్లాడి అందరూ ఐకమత్యంగా ఉండాలని సమస్యలు ఏమైనా ఉండే అధికారులతో మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని అన్నారు.
త్వరలో ఇరుగ్రామాల పెద్దలు, ముఖ్యులతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతవరకు సంయమనం పాటించాలని సూచించారు. ఆయన మాట్లాడుతున్న ససమయంలో అక్కడికి కొంతదూరంలో బలరాం అనుచరుడు అంజిరెడ్డిపై ఆమంచి వర్గీయులు దాడిచేశారు. ఈ నేపథ్యంలో అంజిరెడ్డి అనుచరులు రామన్నపేటలో వెంకటస్వామిరెడ్డి అనే ఆమంచి అనుచరుడిని కొట్టారు. అయితే ఈ రెండు ఘటనలను పోలీసులు ధ్రువీకరించలేదు.