ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ వస్తున్న సమయంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన చేపట్టడం చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీకి ముఖా ముఖి ఎదురుపడటం ఇష్టం లేకనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నెల 26న మోదీ హైదరాబాద్ రానున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. అయితే అదే రోజు కేసీఆర్ బెంగళూర్ వెళ్లనున్నారు. ఇలా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉండటం ఇది మూడో సారి.
2020 నవంబర్లో ప్రధాని మోదీ హైదరాబాద్లోని భారత్ బయోటెక్ను సందర్శించిన సందర్భంలోనూ కేసీఆర్ ఆయన్ను కలవలేదు. ప్రధాన పర్యటనకు రావాల్సిన అవసరం లేదంటూ పీఎంఓ సమాచారం ఇవ్వడంతోనే తాను దూరంగా ఉన్నాయని కేసీఆర్ ఆ తర్వాత స్పష్టం చేశారు. మరోవైపు ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహావిష్కరణ, ఇక్రిశాట్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని ఫిబ్రవరిలో హైదరాబాద్ వచ్చారు.
కానీ ప్రధాని కార్యక్రమాల్లో సీఎం పాల్గొనలేదు. కనీసం మోదీని ఆహ్వానించేందుకు ఎయిర్పోర్టుకు వెళ్లలేదు. జ్వరం కారణంగా పాల్గొనలేదని కేసీఆర్ తెలిపారు. అయితే దీనిపై బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. తాజాగా మోదీ హైదరాబాద్ వస్తున్నందునే కేసీఆర్ కావాలనే రాష్ట్రాల పర్యటనలకు వెళ్లారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తమ్మీద ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.