ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను మాత్రం నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు సీఎం జగన్ మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. కాపు నేస్తం రెండో విడత నిధులను ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ బటన్ నొక్కి ఈ డబ్బును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
మొత్తం 3.27 లక్షల మంది లబ్ధిదారుల అకౌంట్లలో రూ. 490.80 కోట్లు జమ చేశారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు ఐదేళ్లలో రూ. 75 వేలు అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ డబ్బును బ్యాంకులు .. పాత బకాయిల కింద జమ చేసుకోకూడదని సీఎం జగన్ ఆదేశించారు. రెండేళ్లలో కాపు నేస్తం పథకం ద్వారా రూ. 982 కోట్లు లబ్ధిదారులకు అందజేశారు. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ. 15 వేల చొప్పున సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారు.. !
సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని మంత్రి పేర్నినాని కొనియాడారు. గత పాలనలో పార్టీలు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కితే .. సీఎం జగన్ మాత్రం.. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా హామీలను నెరవేరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కులాలు, మతాలకతీతంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాపు నేస్తం పథకంతో కాపులు, బలిజలు, ఒంటరి, తెలగ కులాకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తూ.. ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయన్నారు.