సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ..! మొదట్లో ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం అప్పట్లో సంచలనంగా మారింది. రూ.ఏడు వేలకోట్ల కుంభకోణానికి సంబంధించిన ఈ కేసుపై సమర్థంగా దర్యాప్తు జరిపిన లక్ష్మీనారాయణ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఓఎంసీ కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటక ఎంపీ గాలి జనార్దనరెడ్డి, ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డిలను అరెస్టు చేయడంతో లక్ష్మీనారాయణ మరో సారి వార్తల్లో వ్యక్తి అయ్యారు.
జగన్ అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తులో భాగంగా మరో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, అప్పటి మంత్రి మోపిదేవి వెంకట రమణ తదితరులతోపాటు కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ను కూడా అరెస్టు చేశారు.అక్రమాస్తుల కేసులో జగన్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వూలో జగన్ అరెస్ట్పై క్లారిటీ ఇచ్చారు మాజీ సీబీఐ జేడీ. తాము నిబంధనల ప్రకారం వ్యవహరించి, పై అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశామని, ఆపై 24 గంటల వ్యవధిలోనే కోర్టు ముందు హాజరు పరిచామని వెల్లడించారు.
కోర్టు తమ చర్యలను రివ్యూ చేసి, అవి సరైనవేనని నిర్ధారించిందని ఆయన తెలిపారు. తాను 2006లోనే హైదరాబాద్ సీబీఐ ఆఫీసుకి బదిలీపై వచ్చానని, ఆపై 5 సంవత్సరాల తరువాత 2011లో కేసు తన ముందుకు వచ్చిందని తెలిపారు.
ఈ కేసు కోసం తానేమీ నియమించబడలేదని, జగన్ ను అరెస్ట్ చేయాలని తనపై ఎటువంటి రాజకీయ ఒత్తిడులూ రాలేదని చెప్పారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగానే విచారణ జరిపామని, ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదని, అప్పటి సీబీఐ బాస్ ల నుంచి తనపై ఒత్తిడి వచ్చిందనడం అసత్యమని స్పష్టం చేశారు