కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన వ్యాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జగన్ చేసిన వ్యాఖ్యల ప్రభావం జనసేనపై పడింది. తాజాగా పవన్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తొలి సమావేశం హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ నిర్మాణంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన సమస్యలపై ఈ కమిటీ చర్చించింది. పవన్ కళ్యాణ్ అధక్ష్యతన సాగిన ఈ సమావేశంలో రిజర్వేషన్ల అంశంపై చర్చించారు.
రిజర్వేషన్ల విషయాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వాడుకొంటున్నాయని పొలిటికల్ అఫైర్స్ కమిటీ అభిప్రాయపడింది. కులాల మధ్య చిచ్చు రేపేలా చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. కాపులకు రిజర్వేషన్ల విషయమై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఏడాదికో మాట మారుస్తున్నారని చెప్పారు. కాపుల రిజర్వేషన్ల విషయమై కాంగ్రెస్, టీడీపీలకు చిత్తశుద్ది లేదన్నారు. ఈ విషయమై అధ్యయనం చేసేందుకుగాను నిపుణులతో చర్చించాలని ఆయన భావిస్తున్నారు.
రాజకీయ లబ్ధిని దృష్టిలో ఉంచుకొనే ఆ పార్టీలు రాజకీయ క్రీడలు ఆడటం కాక మరేమవుతుందని కమిటీ వ్యాఖ్యానించింది. నాలుగు దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్, రెండు దశాబ్దాలు పీఠం మీద ఉన్న తెలుగుదేశం పార్టీలకు రిజర్వేషన్లపై నిశ్చితాభిప్రాయం లేకుండా ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.