లగడపాటి రాజగోపాల్…రాజకీయాల గురించి కాసింగ అవగాహన ఉన్న పరిచయం అక్కర్లేని పేరు. ఆంధ్రా ఆక్టోపస్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను చివరి వరకు అడ్డుకున్న ఎంపీ. అంతేగాదు ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేని వాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. కానీ రాష్ట్ర విభజన తర్వాత తాను ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఇక తర్వాత సర్వేల పేరుతో కాస్త హడావిడి చేసినా తర్వాత అది బెడిసి కొట్టడంతో మళ్లీ కనిపించలేదు.
కానీ సీన్ కట్ చేస్తే ఆయన మనస్సు మళ్లీ రాజకీయాల వైపు మళ్లింది. కొద్దిరోజులుగా ఆత్మీయ సమావేశాల పేరుతో రహస్యం అనుచరులతో భేటీ అవుతున్నారు. ఈ భేటీ వెనుక అంతర్యం ఎంతంటే ఆయన తిరిగి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడమే. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు లగడపాటి. అయితే ఏపీలో కాంగ్రెస్ పట్టు కోల్పోవడంతో ఏ పార్టీలో చేరాలన్నదానిపై అనచరుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు.
వాస్తవానికి కొద్దిరోజులుగా ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ నుండి విజయవాడ ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే లగడపాటి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని టాక్. ప్రస్తుతం విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్నదానిపై క్లారిటీ లేదు. దీంతో ఆ స్ధానంలో లగడపాటిని బరిలోకి దింపాలని టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. టీడీపీ కాని పక్షంలో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని టాక్. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లగడపాటికి మధ్య మంచి సంబంధాలున్నాయి. బీజేపీలో చేరితే విజయవాడ పార్లమెంట్ నుంచి టికెట్ పక్కా అని కషాయ నేతలు హామీ కూడా ఇచ్చారట. ఈ నేపథ్యంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నేతలతో సమావేశమై వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారట. మెజార్టీ నిర్ణయాన్ని భట్టి ఆయన టీడీపీ లేదా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.