మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూలిపోవడం ఖాయమంటూ ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో తామే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఎటువంటి ప్రయత్నాలు చేయబోదని ఆయన స్పష్టం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నిజానికి బీజేపీ, శివసేన కలిసి ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించాయి. అయితే ముఖ్యమంత్రి పదవి విషయంలో తేడా రావడంతో.. శివసేన పార్టీ .. కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టు కట్టింది. అప్పట్లో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్పవార్ పక్కా వ్యూహంతో ఉద్దవ్ థాక్రేను సీఎం కుర్చీ ఎక్కించారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫడ్నవిస్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల శరద్పవార్ పలువురు నేతలను కలుసుకుంటున్నారు. ఆయన త్వరలో తృతీయ కూటమి ఏర్పాటు చేయబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఇందుకోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా సహకరిస్తున్నాడని సమాచారం. ఇప్పటికే ప్రశాంత్కిశోర్.. శరద్పవార్ పలు మార్లు భేటీ అయ్యారు.
ప్రస్తుతం జాతీయ మీడియాలో ఈ అంశాలు హాట్టాపిక్గా మారాయి. ఫడ్నవిస్ మాత్రం మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోబోతుందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.
Also Read