ప్రస్తుతం ఏపీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలు కొని.. నేటి ముఖ్యమంత్రి పదవి వరకు జగన్మోహన్ రెడ్డి యొక్క తెగువ, ధైర్యాన్ని వైసీపీ నేతలు తరచూ గొప్పగా చెబుతూ ఉండడం మనం చేస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో వైఎస్ జగన్ కు సంబంధించి, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి జగన్మోహన్ రెడ్డి బయోపిక్ తెరపై ఆవిష్కృతం కానుందా ? అంటే అవుననే వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జగన్ బయోపిక్ ను వైసీపీ నేతలు నిర్మించే అవకాశం ఉందట. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే వైసీపీ నేతలకు ఈ విషయాన్ని పలుమార్లు నొక్కి చెప్పారు కూడా. మరి 175 స్థానాల్లోనూ విజయం సాధించడం అంటే అంతా సులభం కాదనేది అందరికీ తెలిసిన విషయమే. దాంతో ఇప్పటినుంచే ప్రజల్లో నిత్యం జగన్ నామస్మరణ జరిగేలాగా ప్రణాళికలు సిద్దం చేస్తోందట వైసీపీ పార్టీ. అందులో బాగంగానే జగన్ బయోపిక్ తెరపైకి వచ్చింది. గతంలో కూడా జగన్ బయోపిక్ కు సంబంధించి వార్తలు షికారు చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా జగన్ బయోపిక్ తెరపై వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క బయోపిక్ ” యాత్ర ” మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ ఎన్నికలకు ముందు మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా రాజన్న పరిపాలనను ఎన్నికలకు ముందు ” యాత్ర ” మూవీ ద్వారా గుర్తు చేయడంతో.. అది ఓకరకంగా జగన్ కు మైలేజ్ తీసుకొచ్చిందనే చెప్పాలి. అదే ఈసారి ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ బయోపిక్ తెరపైకి తీసుకురావడం వల్ల.. పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారట. మరి జగన్ బయోపిక్ ను కూడా ” యాత్ర ” మూవీకి దర్శకత్వం వహించిన మహి రాఘవనే ఈ మూవీకి కూడా డైరెక్షన్ చేసే అవకాశం ఉందని సమాచారం. మరి జగన్ బయోపిక్ లో కేవలం ఆయన పాదయాత్ర మొదలుకొని సిఎం పరిపాలన వరకు చూపిస్తారా ? లేదా ఆయన పై ఉన్న కేసులు, జైలు జీవితం వంటి అంశాలను కూడా చూపిస్తారా ? అనేది ఆసక్తికరం.