నంద్యాల ఉప ఎన్నిక వైసీపీ అధినేత జగన్ టీమ్కు ప్రజలు దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఆ పార్టీనేతలు చేసిన తప్పులే కొంపముంచాయనె వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ ఎన్నిక ఫలితంనుంచి గుణపాఠం నేర్చుకుంటారా…?
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దలు చెప్తుంటారు. ముఖ్యంగా తండ్రి వారసత్వం నుంచి రాజకీయాలను పుణికి పుచ్చుకున్నారు జగన్. ముఖ్యంగా సీఎం సీటుపై ఆశలు పెట్టుకుని, కనీసం 30 ఏళ్లపాటు ఏపీ ప్రజలను పాలించాలని లక్ష్యంగా పెట్టుకున్నవాళ్లు(ఈ విషయాన్ని ప్లీనరీలో జగనే ప్రకటించాడు) ఖచ్చితంగా అమలు చేయాల్సిన ఫార్ములా అమలు చేస్తున్నాడా…? అమలు చేస్తె.. నంద్యాల ఫలితం ఎందుకు వ్యతిరేకంగా వచ్చిందనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం.
అపార రాజకీయ అనుభవం , పలుకుబడి ఉన్న చంద్రబాబు వంటి కీలక నేతలను ఢీ అంటే ఢీ అని ఎదుర్కొనాలంటే. .. జగన్కు ఉండాల్సింది అక్షరాలా.. ఓర్పు.. నేర్పు.. రాజకీయంగా కూర్పు. ఇవేవి జగన్లో కనిపించడంలేదనేది నంద్యాల ఉప ఎన్నికే నిరూపిస్తున్నాయి.
నంద్యాల ఉప ఫలితాలు.. జగన్ టీంలో అనేక ప్రశ్నలకు సమాధానాలుగా నిలుస్తున్నాయి. నిర్మాణాత్మక విమర్శలు చేయడం, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా.. మేధావులను సైతం కదిలించేలా.. పేదలను ఆదుకునేలా విపక్షం వ్యవహరించాల్సిన తీరును ఈ ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. జగన్ అధికారంలోకి వస్తే.. మాకు లబ్ధి ఉంటుంది. మా జీవితాలు మారతాయి. అనే హామీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే విషయాన్ని కూడా ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి.
అధికార పక్షంలో పదికిపైగా చంద్రబాబుకు సమానంగా అంతకన్నా ఎక్కువగా విపక్షం పై విరుచుకుపడే నేతలు ఉన్నారు. మరి వైసీపీలో ఉన్నారా అంటె లేరనె చెప్పాలి. ఎంతసేపు అరిగిపోయిన రికార్డులా .. అంబటి రాంబాబు, రోజా, వాసిరెడ్డి పద్మ.. జగన్.. తప్ప ఇంకెవరూ లోటస్ పాండ్ నుంచి తయారవుతున్న నేతలు కనిపించడం లేదు. అదేసమయంలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలను కూడా జగన్ సరైన విధంగా వినియోగించడం లేదు.
అధికార పార్టీ 50 మంది ఎమ్మెల్యేలను, మంత్రులను దింపింది. కాని వైసీపీ మాత్రం కనీసం పట్టుమని పదిమంది కూడా లేరు. ఏం మాట్లాడితే.. జగన్తో ఏం తిట్లు తినాల్సి వస్తుందో? అనే ధోరణిలోనే నేతలు మౌనంగా ఉండిపోయారు. కాబట్టి.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని 2019కి జగన్ బాహుబలిగా విజృంభిస్తేనే అధికారంలోకి వస్తారు. లేకుంటె కాళకేయినిగా మిగిలిపోతారు.