తెలంగాణలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక పెంచుతున్న పోలిటికల్ హిట్ అంతా ఇంత కాదు. నువ్వా నేనా అంటూ మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల సమరంలో కదం తొక్కుతున్నాయి. టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీల మద్య కూడా రసవత్తరమైన పోరు నెలకొనడంతో గెలుపు ఎవరిని వరిస్తుందా అంటూ తెలంగాణ ప్రజలతో పాటు రాజకీయ పండితులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు ఒక రకంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల టిఆర్ఎస్ నేత కేటిఆర్ చేసిన వ్యాఖ్యలపై కొంత వ్యతిరేకత కూడా ఎదురవుతోంది.
మునుగోడు లో టిఆర్ఎస్ ను గెలిపిస్తే సిరిసిల్ల మాదిరి డెవలప్ చేస్తామని, మునుగోడును దత్తత తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కొందరు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. మునుగోడు కంటే ముందు రాష్ట్రాన్ని దత్తత తీసుకొని అభివృద్ది చేయండి అంటూ హితవు పలుకుతున్నారు. తెలంగాణలో మునుగోడు ఒక్కటే కాదని అభివృద్ది చేయాల్సిన నియోజిక వర్గాలు చాలా ఉన్నాయని వాటిపై కూడా ఫోకస్ చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు.
అయితే ఉప ఎన్నిక జరిగే నియోజిక వర్గంలో వారాల జల్లు కురిపించడం టిఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఫాలో అవుతోంది. గతంలో హుజూరాబాద్ ఎన్నికల సమయంలో దళిత బందు పథకం కూడా కేవలం బైపోల్ ను దృష్టిలో ఉంచుకొని అమలు చేసిన పథకం అనే విమర్శలు తరచూ వినిపిస్తున్నే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా మునుగోడును దత్తత తీసుకొని అభివృద్ది చేస్తాం అని కేటిఆర్ వ్యాఖ్యానించడంతో.. ఇంతవరకు అధికారంలో ఉండి కూడా ఎందుకు అభివృద్ది చేయలేదనే ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి హీట్ పెంచుతోన్న మునుగోడు ఉపఎన్నిక ఏ పార్టీని విజయం వరిస్తుందో చూడాలి.