ఆయన వృత్తి రీత్యా వైద్యుడు. అయితే లక్ చిక్కి అనూహ్యంగా స్థానిక నాయకుల సహకారంతో రాజకీయా ల్లోకి వచ్చారు. అదేవిధంగా ఈయన రాజకీయాల్లో రాణించేందుకు స్థానిక టీడీపీ నేతలు సైతం ఎంతో కృషి చేశారు. దీనిలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కృషి ఎంతో ఉంది. గతంలో దామచర్ల తాత ఆంజనేయులు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ప్రజల మనసులు గెలుచుకున్నారు. అలాంటి నియోజకవర్గం పునర్విభజనలో ఎస్సీలకు కేటాయించడంతో దామచర్ల కూడా డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అయితే.. పార్టీకి, ప్రజలకు ఎంతో సేవ చేస్తారని, సమాజంలో మార్పు తెస్తారని భావించి ఎన్నా ఆశలతో ఆయనను ప్రోత్సహించారు. ఇక, స్థానిక పార్టీ శ్రేణులు కూడా డోలాకు పట్టంకట్టాయి.
ఆయనకు అన్ని విధలా సహకారం అందించాయి. 2009లో కొద్ది దూరం తేడాతో ఓటమి పాలైనా.. టీడీపీ శ్రేణులు, స్థానిక నాయకులు పట్టుబట్టి గత ఎన్నికల్లో రంగంలోకి దింపారు. ఆ ఎన్నికల్లో కొండపి టీడీపీ టిక్కెట్ కోసం చాలా మంది పోటీ పడినా దామచర్ల జనార్థన్, స్థానిక టీడీపీ కేడర్ పట్టుబట్టి మరీ ఆయనకే సీటు ఇచ్చేలా బాబుపై ఒత్తిడి చేసి సక్సెస్ అయ్యారు. ఆ ఎన్నికల్లో స్వామి వైసీపీ అభ్యర్థి జూపూడి ప్రభాకర్ను సైతం ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. తొలిరెండేళ్లు బాగానే ఉన్నా.. తర్వాత తర్వాత మాత్రం ఆయన కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం ప్రారంభించారు. తనకు సాయం చేసిన, తనకు ప్రచారం చేసిన వారినే ఆయన పక్కన పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా దామచర్ల జనార్దన్ & ఆయన అనుచరులను పక్కన పెట్టేశారు.
నియోజకవర్గంలో టీడీపీ రెండుగా చీలడానికి కారణమైన ఓ అవుట్ డేటెడ్, విఫల రాజకీయ నేతను ఒకరిని నమ్ముకుని పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. కొండపి టీడీపీ రెండుగా చీలడానికి కారణమైన ఓ వ్యక్తి చేతుల్లో ఆయన కీలుబొమ్మగా మారిపోయారన్న విమర్శలు ఉన్నాయి. అసలు స్వామిని పక్కదారి పట్టించిన ఆ వ్యక్తే కొండపి టీడీపీ రెండుగా చీలడానికి కూడా ప్రధాన కారణమన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు, తనకు అండగా నిలిచిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల సహా సమీప నియోజకవర్గం టంగుటూరు ఎమ్మెల్యే పోతుల రామారావుపై కూడా ఆయన ధిక్కార పతాకం ఎగురవేశారు. ఇక, కొండపిలో మంచి పలుకుబడి, వర్గం ఉన్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని కూడా డోలా లెక్కచేయడం లేదు.
ఇక, అంతో ఇంతో పలుకుబడి, వర్గం ఉన్న జూపూడి ప్రభాకర్ వర్గాన్ని కూడా లెక్కచేయడం లేదు. ఇక, ప్రజల సమస్యలను పట్టించుకోవడం మానేసి చా న్నాళ్లే అయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డోలా ఆధిపత్య ధోరణి రాజకీయాలు పెరిగిపో యా యనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇక్కడ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సభ నిర్వహించారంటే.. డోలాపై స్థానిక టీడీపీ నేతలు ఎంతలా కారాలు మిరియాలు నూరుతున్నారో తెలుస్తోంది.
దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసినా.. ఆయనకు పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చినా ఓటమి ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికితోడు డోలాను మట్టికరిపించేందుకు ప్రతిపక్షం వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ప్రధానంగా ఇక్కడ సమన్వయకర్తగా ఉన్న వరికూటి అశోక్ బాబును తప్పించి.. డాక్టర్ వెంకయ్యకు ఛాన్స్ ఇచ్చారు. ఈయన దాదాపు 20 కోట్లకు పైనే ఖర్చు చేసి అయినా డోలాను ఓడిస్తానని శపథం చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో డోలా గెలుపు మాట అటుంచి.. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకునే పరిస్థితి లేదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఏదేమైనా.. తనను ఆదరించి, అవకాశం ఇచ్చిన వారిని డోలా ఇలా చిన్నచూపు చూడడం, పనిలేని కొందరు సొంత పార్టీ నేతలను ప్రజాభిమానం కోల్పోయి.. కక్షలే రాజకీయాలు నిత్యం పనిచేస్తున్న వారితో చేతులు కలపడం ఆయనను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించనున్నాయని అంటున్నారు విశ్లేషకులు.