ఆలిండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) జాతీయ స్థాయి విస్తరణ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లు సాధించిన ఉత్సాహంతో వచ్చే ఏడు జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మజ్లిస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల ప్రకటించారు. తాజాగా కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీతో మజ్లిస్ పొత్తుకు ఆసక్తి చూపుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఎంఐఎం నేతలతో అసద్ సోమవారం భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చించినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య ‘పొత్తు’పొడిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని కమల్ సోమవారం ప్రకటించారు. అయితే తాము పోటీ చేసే నియోజకవర్గాలపై త్వరలోనే స్పష్టతనిస్తావన్నారు. జనవరి మా సాంతంలో ఒవైసీ చెన్నైకి వెళ్లి, పొత్తుకు తుది రూపం ఇవ్వనున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అదే నిజమైతే తమిళనాట సరికొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒక్కొక్క అడుగు
మొన్నటివరకు హైదరాబాద్ నగరానికే పరిమితమైన మజ్లిస్ పార్టీ జాతీయ స్థాయిలో విస్తరించాన్న ప్రణాళికతో ఒక్కో రాష్ట్రంలో ఉనికి చాటుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో వేళ్లూనుకుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తాచాటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే సమయంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి పథకం రచిస్తోంది. బెంగాల్ అసెంబ్లీలో కనీసం 20 మంది తమ సభ్యులు ఉండేలా పార్టీ చీఫ్ ఓవైసీ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముస్లింల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలను మజ్లిస్ టార్గెట్ చేస్తోంది. తమిళనాడులోనూ అదే పంథా కొనసాగించాలని చూస్తోంది.
తమిళనాట 25 సీట్లలో పోటీ చేయాలని, ఈ స్థానాల్లో కమల్తో పొత్తు పెట్టుకోవాలని అసద్ నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే, తమిళనాట ఇప్పటికే అనేక ముస్లిం పార్టీలున్నాయి. వాటన్నింటినీ ఏకతాటిపైకి తేవాలని ఒవైసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.