వైసీపీ అధినేత జగన్ పై దాడి అంశంపై జనసేనాని పవన్ కల్యాణ్ మొదటి సారి స్పందించారు. జగన్పై జరిగిన దాడి దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దాడిపై సీఎం చంద్రబాబు వెకిలిగా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. దాడి ఘటనను లోతుగా విచారించాలని అన్నారు. కావాలని నిందితుడు దాడి చేశాడా? లేక ఇతరుల ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారించాలని సూచించారు. దాడి వెనక కుట్ర ఏమైనా ఉందా అనే విషయం విచారణలో తేలాలని చెప్పారు.
జగన్ పై దాడి ఘటనను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. నిందితుడు శ్రీనివాస్ దాడి కావాలని చేశాడా..?వేరేవారెవరైనా చేయించారా..? ఏదైనా కుట్ర దాగి ఉందా అనేది పోలీసులు విచారణలో తేలాల్సి ఉందన్నారు. తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు దాడి చేయించారని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యల్ని పవన్ ఖండించారు. ఎక్కడైనా తల్లి కొడుకుపై దాడి చేయిస్తుందా అంటూ నిలదీశారు. విజయమ్మ, షర్మిలలు తనను ఎన్నో తిట్టారని అలాగని తాను వాళ్లని ఏమీ అనలేదని తెలిపారు.
జగన్ దాడి అంశంలో లక్ష్మణ రేఖను దాటి టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేశారని అది సరికాదని పవన్ అన్నారు. రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపి వాస్తవాలు బయటకు తేవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే నన్నారు. ప్రజాపోరాట యాత్రలో పోలీసులు తనకు రక్షణ కల్పించకపోవడంతో ఇబ్బంది పడ్డానని తెలిపారు.