ఒక వైపు ప్రత్యేక హోదా మరో వైపు 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. శెట్టిబలిజ వర్గం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంది. తమ శెట్టిబలిజల కులానికి వైసీపీ తగిన ప్రాధాన్యమివ్వకపోవడంపై వారు నిరసన వ్యక్తం చేశారు.
ప్రత్యేకహోదా కోసం వైసీపీ చేపట్టిన కార్యక్రమాలకు శెట్టిబలిజ సామాజిక వర్గం దూరమైంది. దీక్షా శిబిరాల్లో ఉన్న శెట్టిబలిజ కార్యకర్తలను ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు తీసుకెళ్లిపోయారు. వైసీపీ అధినేత జగన్ తన నిర్ణయం మార్చుకోకపోతే శెట్టిబలిజ సామాజికవర్గం వైసీపీకి శాశ్వతంగా దూరమవుతుందని ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, పలువురు నేతలు హెచ్చరించారు.
ఈ కమ్యూనిటియే తమ రాజకీయ ఎదుగుదలకు కారణమని, వారిని పట్టించుకోెకపోతే కష్టమని వారు అన్నారు. శెట్టిబలిజ కమ్యూనిటి అండను పోగొట్టుకుని రాజకీయాల్లో తాము మనుగడ సాగించలేమని, వీరిని పొగొట్టుకుంటే తమను కనీసం పలకరించేవారు కూడా ఉండరని, అందువల్ల, శెట్టిబలిజ సంఘం నాయకుల మాటలను తాము కచ్చితంగా విని తీరాలని అన్నారు.
వైసీపీలో శెట్టి బలిజలు కొనసాగుతున్నప్పటికీ తమ విన్నపాలను పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం జరిగే వరకు పార్టీ కార్యక్రమాలన్నింటిని తాత్కాలికంగా బహిష్కరిస్తామని ఆ సామాజిక వర్గం నాయకులు చెప్పారని అన్నారు. ఇది వైసీపీకీ కొంత వరకు ఇబ్బంది కలిగించే విషయమే. మరి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.