ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ వలసలపై దృష్టి సారించింది. టీడీపీలో ఉన్న బలమైన సామాజిక వర్గం కలిగిన నేతలను పార్టీలో చేర్చుకొనేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీలో చేరుతుండటంతో మాంచి జోష్ మీద ఉన్న వైసీపీ మరింత మందిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా కడపజిల్లాల్లో మైనారిటీ వర్గానికి చెందిన టీడీపీ మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకొనేందుకు వ్యూహాలు రచిస్తోంది.
పాదయాత్ర ముగిసిన తరువాత జగన్ తటస్థులను ఆకర్శించేందుకు అన్నా పిలుపుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలుకుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ నేత ఖలీల్బాషాను పార్టీలో చేర్చుకొనేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
వైసీపీ మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అంజద్బాష, మేయర్ సురేష్బాబు ఆదివారం సాయంత్రం ఖలీల్ బాషాను ఆయన స్వగృహంలో కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అనుచరులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటానని ఖలీల్ బాషా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
2009 టీడీపీకి గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ తరుపున కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత టీడీపీలో చేరిన ఆయన కడప అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావించారు. అయితే అధినేత నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అప్పటినుంచి దూరంగా ఉంటున్నారు. ఆయన అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది.