ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి టీడీపీ అధ్యక్షపదవి విషయం మరోసారి తలనొప్పిగా మారింది. దీన్ని ఎవరికి కేటాయించాలనే దానిపై బాబు గందరగోలంలో ఉన్నారు. మంత్రి వర్గంలోకి కళా వెంకట్రావ్ను తీసుకున్న తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది. దీనితో పాటు ఉన్న జాతీయ కమిటీతో పాటు తెలుగు రాష్ట్రాల కమిటీలను పొలిట్ బ్యూరోను ఖరారు చేసేందుకు ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అయితే ఈసారి అధ్యక్ష పదవి ఏప్రాంతానికి ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ పలు కారణాల వల్ల అది ఓకే కాకపోవచ్చునని అంటున్నారు.
తొలుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నిమ్మకాయల చినరాజప్ప పేరు ప్రచారంలోకి వచ్చినా పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెడితే ప్రజల్లోకి తప్పడు సంకేతాలు వెళతాయని భావించినట్టు సమాచారం. కర్నూలు జిల్లా పర్యటనకు వెళుతున్న చంద్రబాబు అంతకు కొద్దిముందు పార్టీ నేతలతో కమిటీలను ప్రకటించే అంశంపై చర్చించారు. అయితే ఈ సందర్భంగా కేఈని ఎంపిక చేసే ప్రస్తావన వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. కానీ దీనితో పలువురు విబేధించినట్లు దానికి బాబు సైతం సమ్మతించినట్లు తెలుస్తోంది.
పార్టీ అధినేత సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నకేఈ కృష్ణమూర్తి కూడా ఇదే ప్రాంతానికి చెందినవారు అవుతారని కొందరు నేతలు అభ్యంతరం చెప్పారు. ఏపీ అధ్యక్షుడిగా కోస్తాంధ్ర నుంచి ఎంపిక చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు కొందరు నేతలు.
దీంతో కాపు సామాజికవర్గానికి చెందిన వారిని రాష్ట అధ్యక్షుడిగా నియమించాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ప్రతిపాదించారు. దీంతో…మరోమారు పార్టీకి చెందిన సీనియర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించివారి అభిప్రాయాలను తెలుసుకున్నాకే పార్టీ అధ్యక్షపదవిపై ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఈసారి అధ్యక్ష పదవి సీమకు వస్తుందో లేకా కోస్తాకు వెల్తుందో వేచి చూడాలి.