ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు పూర్తి అయింది. మరో ఏడాదిన్నర లో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభుత్వం స్థాపిస్తుందని జగన్ పాలనకు తిరుగులేదని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు తరచూ చెబుతూనే ఉన్నారు. ఇక వైఎస్ జగన్ కూడా ఈసారి 175 స్థానాలలో క్లీన్ స్వీప్ విజయం సాధించాలనే టార్గెట్ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికి.. సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటివద్దకే చేరే విధంగా చర్యలు తీసుకోవడం.
అలాగే వాలెంటరీ వ్యవస్థ మరియు సచివాలయ వ్యవస్థలతో ప్రభుత్వ పాలననే ప్రజల వద్దకు చేర్చడం నిజంగా ప్రశంసనీయమే. అయినప్పటికి జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతక ఉందనేది ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే పథకాలపై పెడుతున్న దృష్టి.. అభివృద్దిపై పెట్టడంలేదనే విమర్శలు గట్టిగానే ఎదుర్కొంటున్నారు సిఎం జగన్. ముఖ్యంగా ఏపీలోని రోడ్ల విషయంలో జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్నాయి. క్షేత్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి సామాన్యుడు రోడ్ల విషయంలో జగన్ సర్కార్ పై వేలెత్తి చూపెడుతూనే ఉన్నారు. అయినప్పటికి రోడ్ల మరమత్తు విషయంలో జగన్ సర్కార్ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోంది.
ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఏపీ లోని రోడ్ల దుస్థితిపై ఘాటు విమర్శలు చేశారు. ఏపీ లోని రోడ్ల దుస్థితి కేంద్ర మంత్రులకు కూడా జాలి కలుగజేస్తోందని, రాష్ట్ర ప్రజలకు దారుణమైన రోడ్లతో జగన్ నరకం చూపెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. అయితే వైసీపీ పార్టీకి ఈ రోడ్ల సమస్య వచ్చే ఎన్నికల్లో పెను సవాల్ గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పథకాలు ఎన్ని అమలౌతున్నప్పటికి ప్రజలు ప్రధానంగా రోడ్లను గమనిస్తున్నారని, అందుకే జగన్ ప్రభుత్వంపై సానుకూలత ఏ స్థాయిలో ఉందో వ్యతిర్రెకత కూడా అంతే స్థాయిలో ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.