ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బీజేపీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల వద్ద కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్కు అడ్డుతగిలారు. ఈ సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దాడి ఘటన ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక టీఆర్ఎస్ దాడులు చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ నేతలపై దాడి జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే ఖర్మ తమకు పట్టలేదన్నారు మంత్రి కేటీఆర్. ఏ మొఖం పెట్టుకొని పాలమూరులో పాదయాత్ర చేస్తున్నావు అంటూ మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏన్ని పైసలు ఇచ్చిందని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు బండి కౌంటర్ ఇచ్చారు. బరా బర్ పాదయాత్ర చేస్తానని, కేసీఆర్ దమ్ముంటే నువ్వు పాదయాత్ర చేయ్ అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు మీరు చేసిన ఘన కార్యాలేమిటో వివరించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడటమే మేం చేస్తున్న నేరమా? అని ప్రశ్నించారు. పేదల ప్రభుత్వం రావాలంటే… గడీల పాలన పోవాల్సిందేనంటూ ఫైర్ అయ్యారు.