వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎట్టకేలకు ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభించారు. ఈరోజు ఉదయం ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభానికిముందు బహరంగ సభలో జగన్ బాబుపై నిప్పులు చెరిగారు. బాబు ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిపోయారని మండిపడ్డారు. రాజధాని కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ఆరోపించారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు రాజధాని కోసం ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్నారు.
బ్రహ్మాండమైన రాజధాని కడతామని చంద్రబాబు చెప్పారని… ఇంతవరకు ఒక్క శాశ్వత భవనానికి కూడా ఒక్క ఇటుక కూడా వేయలేదని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏ సినిమా రిలీజ్ అయినా దాన్ని చూస్తారని… సినిమాను చూసి, బాహుబలిలో సెట్టింగ్ బాగుంది, మన రాజధాని అదిగో అంటూ చెప్పేస్తారని అన్నారు.
ఒక వైపు టీడీపీ వారు సెక్స్ రాకెట్ నడుపుతున్నారు, రిషికేశ్వరి వంటి అమ్మాయిలు చనిపోతే పట్టించుకోరా అని జగన్ ధ్వజమెత్తారు. విజయవాడలో సెక్స్ రాకెట్ నడుస్తోందని, కానీ చర్యలు లేవని మండిపడ్డారు. బాబు పాలనలో ఉద్యోగస్తులు కూడా సంతోషంగా లేరన్నారు.
పనిలో పనిగా చంద్రబాబుకు దమ్మున్న సవాల్ విసిరారు. నంద్యాలలో గెలుపును చంద్రబాబు తమ గెలుపుగా చెప్పుకుంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు. కానీ తాను బాబుకు తాను ఓ సవాల్ విసురుతున్నానని, నీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని నీవు అనుకుంటే తమ పార్టీ నుంచి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఒకేసారి ఉప ఎన్నికలు వచ్చేలా చేయాలన్నారు.
నంద్యాలలో అధికార దుర్వినియోగంతోపాటు రూ.200 కోట్లు ఖర్చు చేసి గెలిచారన్నారు. ఒకేసారి ఇరవై స్థానాల్లో ఎన్నికలు అంటే చంద్రబాబుకు రూ.4000 కోట్ల నల్లధనం కావాలన్నారు. అంత ఖర్చు పెట్టి ఎలా గెలుస్తారో చూస్తానని ప్రశ్నించారు. సవాల్ను చంద్రబాబు స్వీకరించాలన్నారు. మరి దీనికి బాబు అండ్ బ్యాచ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.