ఏపీ పరిపాలన రాజధాని విశాఖపట్నం జిల్లాను ఈసారి క్లీన్ స్వీప్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీస్తే విశాఖ నగరంలో నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ సత్తా చాటింది. తర్వాత జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ టీడీపీ సత్తా చాటింది. దీంతో ఫోకస్ విశాఖగా ముందుకు సాగుతున్నారు జగన్. ఇందులో భాగంగా విశాఖలో పెద్ద ఎత్తున సిట్టింగ్లను మారుస్తారని ప్రచారం జరుగుతోంది.
విశాఖ సౌత్ లో టీడీపీ నుండి గెలిచిన వాసుపల్లి గణేశ్ వైసీపీలో చేరారు. ఇక ఇదే స్థానంలో గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన సీతం రాజు సుధాకర్ పోటీ ఇస్తున్నారు. దీంతో గణేశ్ – సీతంరాజు మధ్య పోటీ నెలకొనగా ఎవరికి టికెట్ దక్కుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశాఖ తూర్పు నుండి వెలగపూడి రామకృష్ణబాబు ఎమ్మెల్యేగా ఉండగా ఆసారి గట్టి అభ్యర్ధిని బరిలోకి దించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఎంపీ ఎంవీవీ పేరు వినిపిస్తోంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోనూ ఇన్చార్జిని మార్చారు సీఎం జగన్. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ స్థానంలో విశాఖ డైయిరీ నేత అడారి ఆనంద్ను పశ్చిమ ఇన్చార్జిగా నియమించారు.
విశాఖ ఉత్తర నుండి మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు ప్రాతినిధ్యం వహిస్తుండగా ఈ సారి గంటా వేరే చోట నుండి పోటీ చేస్తారాని తెలుస్తోండగా ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన కేకే రాజుకు మళ్లీ టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భీమిలి నుండి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తుండగా మళ్లీ ఆయనకే ఛాన్స్ దక్కనున్నట్లు టాక్. ఇక ఇక్కడి నుండి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్రాజును ఈసారి మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. టీడీపీ – జనసేన పొత్తుతో టఫ్గా మారే అవకాశం ఉండటంతో మంత్రి అమర్నాథ్ లేదంటే ఎమ్మెల్సీ వరుదు కల్యాణిలను ఇక్కడి నుంచి పోటీకి దించాలని భావిస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీకి కొంచెం ఎడ్జ్ ఉండటంతో ఈ సారి విశాఖ జిల్లాలో వైసీపీ హవా కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.