తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేసే దిశగా వైయస్ షర్మిల కార్యాచరణను ముమ్మరం చేశారు. వచ్చే నెలలో తన పార్టీ పేరు, జెండా, అజెండాలను ఆమె అధికారికంగా ప్రకటించనున్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించిన వైఎస్ షర్మిల.. అందుకు కార్యాచరణను రూపొందిస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన ఆమె… అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై అవకాశం దొరికినప్పుడల్లా తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
ఈ కార్యాచరణలో భాగంగా షర్మిల జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో షర్మిల పర్యటిస్తున్నారు. ఆమె మంత్రి కేటీఆర్ ఇలాకాలో పర్యటించడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కార్మిక క్షేత్రం సిరిసిల్లలో షర్మిలకు వైఎస్ఆర్ అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి జిల్లాలోని 14 కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేయనున్నారు. అనంతరం కరీంనగర్లో లంచ్ చేసి సింగరేణి కార్మికులను కలవనున్నారు.
తొలిసారి రాజన్న సిరిసిల్ల జిల్లాకు షర్మిల రావడంతో అభిమానులనుంచి అపూర్వ స్వాగతం లభించింది. అంతే కాదు ఈ సందర్భంగా సిరిసిల్లలోని డాక్టర్ పెంచలయ్య ఇంటికి వెళ్లిన షర్మిలకు.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను ఆయన బహుకరించారు. ఈ కానుక తన జీవితంలోనే ఓ అపురూపమైన కానుక అంటూ ధన్యవాదాలు తెలిపారు వైఎస్ షర్మిల.
విహారంలో విషాదం.. పెన్నా నదిలో మునిగి నలుగురు మృతి!