ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ రాజీనామాలు చేసిన ఐదుగురు వైసీపీ లోక్సభ సభ్యులు వాటి ఆమోదం కోసం ఈరోజు ఢిల్లీలో స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలిశారు. వారితో కాసేపు చర్చించిన సుమిత్రా మహాజన్… రాజీనామాలు చేయడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకే తమ పదవులకు రాజీనామాలు చేశామని వెంటనే తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్తో ఎంపీలు పేర్కొన్నారు.
మా రాజీనామాలు త్వరగా ఆమోదించాలని స్పీకర్ను కోరతామని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. స్పీకర్ మా రాజీనామాలు ఆమోదిస్తారని ఆశిస్తున్నాం. ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మాటలు మారుస్తూ చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారనీ విమర్శించారు.
విభజన హామీల అమలు కోసం మొదటి నుంచి పోరాడుతున్నామని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. హోదా కోసం ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేసి నిరాహార దీక్ష చేపట్టామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమతో కలిసి రాజీనామాలు చేయాలని టీడీపీ ఎంపీలను కోరామని, 25మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే హోదా వచ్చేదని అన్నారు.
హోదా కోసం రాజీనామాలు చేశామని, తమ రాజీనామాలు ఆమోదించకపోతే ఏపీ ప్రజలను అవమానించినట్లే అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తక్షణమే తమ రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, అందుకే తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించడం లేదన్నారు.
స్పీకర్ను కలిసి రాజీనామాలు ఆమోదించాలని కోరతామని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించడానికి చంద్రబాబు భయమని, ఉప ఎన్నికలంటే జంకుతున్నారని ఆయన విమర్శించారు