ఎండలు కాల్చేస్తున్నాయి. ఎండలు పేల్చేస్తున్నాయి. ఎండలు చంపేస్తున్నాయి. ఇంకా చలి దుప్పటి కప్పుకున్నట్లుగానే ఉంది. పగిలిన పెదాలపై రాసుకున్న లిప్ బామ్ మరకలు ఇంకా మాసిపోనట్లే ఉన్నాయి. ఆకులపై కురిసిన మంచు బిందువులు ఇంకా మినుకుమినుకు మంటూనే ఉన్నట్లు ఉంది. అంతలోనే ఎంతెంత ఎండలు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శాసనసభ సమావేశాల్లో వేడివేడి చర్చలు జరుగుతూంటే బయట సూర్య భగవానుడు కూడా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మనుషులు అల్లాడిపోతున్నారు. జంతువులు చెట్ల నీడకు చేరి బతుకు జీవుడా అనుకుంటున్నాయి. గుక్కెడు మంచినీటికి బోలెడంత గిరాకీ. కోనసీమవో.. బెంగుళూరువో… శ్రీకాకుళం జిల్లావో.. ఎక్కడి వైనా సరే కొబ్బరి బొండం నీళ్లు తాగాలని ప్రాణాలు కొట్టుకుంటున్నాయి.
గ్లాసుడు పళ్ల రసం కోసం పరుగులు. ఉడకేస్తున్న ఎండల నుంచి ఉపశమనం కోసం ఉరుకులు. మొత్తానికి తెలుగు రాష్ట్రాలు భగ్గున కాలుతున్న పెనం మీద ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు కణకణ మండుతున్న ఎండ నిప్పుల మీదున్నాయి. ఎసిలు.. ఫ్యాన్లు కొనడం కాదు కాని… చెట్లను నరకడం మానేద్దాం. గుప్పెడు విత్తనాలను చల్లడం ప్రారంభిద్దాం. అపార్ట్ మెంట్ 16 అంతస్తులో ఉంటున్నాను అని మురిసిపోవడం వదిలేద్దాం. వినాసనం కాదు.. వికాసం నేర్చుకుందాం.