గోదావరి పుష్కరాల్లో గాయపడ్డ భక్తులను పరామర్శించాలని తనకూ ఉందని.. అయతే తను ఇప్పుడు అక్కడికి వెళితే మళ్లీ అక్కడ తొక్కిసలాట జరుగుతుందనే భయంతోనే ఆగిపోతున్నానని చెప్పుకొచ్చాడు “జనసేన” అధ్యక్షుడు పవన్ కల్యాణ్.
మరి బహుశా ప్రపంచంలో ఇలాంటి ప్రకటన చేసిన నాయకుడు పవన్ కల్యాణ్ మాత్రమేనేమో! ఎందుకంటే… నాయకుడు అనేవాడెవడూ ఇలా మాట్లాడడు! తనకున్న ఫాలయింగ్ చాలా ఎక్కువ అని.. అందుకే బాధల్లో ఉన్న వారిని పరామర్శకు రావడం లేదని చెప్పిన మహనీయ నేత ఎక్కడా చరిత్రలో కనపడలేదు. ఇలా మాట్లాడుతున్నది పవన్ కల్యాణ్ మాత్రమే.
అయితే పవన్ ఇలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.. తీవ్ర విమర్శలకు దారి తీసేదిలా ఉంది. పవన్ తన గురించి తాను ఎక్కువగా ఊహించుకొంటున్నాడేమో అనిపిస్తోంది. అలాంటి భ్రమల్లో ఉండి పవన్ ఇలా మాట్లాడుతున్నాడేమో అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఎందుకంటే.. రాజకీయ నేతలకు అందరికీ ఫాలోయింగ్ ఉంటుంది. ఫాలోయింగ్ అంటే అది కేవలం పవన్ కు మాత్రమే ఉండేది కాదు. చంద్రబాబుకూ ఫాలోయింగ్ ఉంటుంది.. జగన్ కూ అభిమానగణం ఉంటుంది.
వారు కూడా పవన్ లాగే అనుకొని ఉంటే? తాము ఇప్పుడు జనాల మధ్య కు వెళితే అక్కడ ఇంకా క్రౌడ్ ఎక్కువ అవుతుందని.. కనీసం పరామర్శల గురించి కానీ, అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించడం గురించి పట్టించుకోవడం మానేసి ఉంటే? వారు కూడా ట్విటర్ కే పరిమితం అయి ఉంటే?! పవన్ ఎంత కాదన్నా సినీ నటుడు.. కాబట్టి.. ఆయన వస్తే జనాల హడావుడి ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఉండవచ్చు. అంత మాత్రానా.. తను అందుకే జనాల మధ్యకురావడం లేదని పవన్ ప్రకటించుకోవడం విడ్డూరంగా.. హాస్యాస్పదంగా ఉంది. బహుశా పవన్ ఎన్నికల సమయంలో ఓటు అడగడానికే వస్తాడు కాబోలు.!