2011 ఏప్రిల్ రెండో తేదీన టీమిండియా ప్రపంచకప్ ఫైనల్ లో శ్రీలంక మీద నెగ్గిన సంగతి తెలిసిందే. నేటితో ఆ ఫీట్కు ఏడు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో నాటి భారత జట్టు వీరవిహారాన్ని తలుచుకుంటే భారతీయ క్రికెట్ ప్రియుల రోమాలు నిక్కబొడుకుంటాయని వేరే చెప్పనక్కర్లేదు.
ఇక మహేంద్ర సింగ్ ధోనీకి అతని అభిమానులకు ఏప్రిల్ 2 ఓ ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు భారత్కు ప్రపంచకప్ అందించిన ధోని.. ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకోనున్నాడు. రాష్ట్రపతి భవన్లో జరగనున్న కార్యక్రమంలో ధోనీని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించనుంది.
ధోనీతోపాటు బిలియర్డ్స్ చాంపియన్ పంకజ్ అద్వానీ కూడా పద్మ భూషణ్ అందుకోనున్నాడు. ఇక గత మార్చి 20న తొలి బ్యాచ్కు ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను రాష్ట్రపతి అందజేశారు. క్రీడల విభాగంలో టెన్నిస్ ఆటగాడు సోమదేవ్ దేవర్మన్, బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్, 1972 పారాలింపిక్స్ స్వర్ణ విజేత, స్మిమ్మర్ మురళీకాంత్ పటేకర్లు ఈ అవార్డులు అందుకున్నారు.