రెండో వన్డేలో తాడో పేడో తేల్చుకోవాల్సిన టీమ్ ఇండియా టీమిండియా న్యూజిలాండ్పై ప్రతీకారం తీర్చుకుంది. ఇక్కడ జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో కివీస్ పై విరాట్ సేన ఘన విజయం సాధించింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 68, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దినేశ్ కార్తీక్ 64 పరుగులతో రాణించడంతో 4 ఓవర్లు మిగిలి ఉండగానే టీమిండియా 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా మిగతా బ్యాట్స్మెన్లో రోహిత్ శర్మ 7, కెప్టెన్ విరాట్ కోహ్లీ 29, హార్దిక్ పాండ్యా 30, ధోనీ 18 పరుగులు చేశారు.
మొదట టాస్ గెలిచి బ్యాంటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆదిలోనె ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది. నిర్ణీత ఓవర్లాడిన కివీస్ 9 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ఓపెనర్లు గప్టిల్ (11), మున్రో (10) లను భారత పేసర్ భువీ ఔట్ చేశాడు. గత మ్యాచ్ లో భారీ ఇన్నింగ్స్ లు ఆడిన లాథమ్(38), రాస్ టేలర్ (21) లు ఈ వన్డేలో త్వరగా ఔట్ కావడంతో కివీస్ స్వల్ఫ స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లు ఈ మ్యాచ్ లో సమష్టిగా రాణించి కివీస్ ను భారీ స్కోరు చేయకుండా సక్సెస్ అయ్యారు.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా మొదటి వన్డే న్యూజిలాండ్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ రోజు జరిగిన రెండో వన్డేలో టీమిండియా గెలవడంతో ఇరు జట్లు 1-1 తేడాతో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో సిరీస్ ఫలితాన్ని తేల్చే ఫైనల్ మ్యాచ్పై ఆసక్తి నెలకొంది.