బీసీసీఐ విండీస్ టూర్కు భారత జట్టును ఎంపిక చేసింది. జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో వన్డే, టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు యువబౌలర్ నవదీప్ సైని. ప్రస్తుతం టీమిండియాలో ఫాస్ట్ గా బంతులు విసిరే బౌలర్ ఎవరంటే జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఉన్నారు. బుమ్రా నిలకడగా గంటకు 145 కిమీ వేగంతో బంతులేస్తుంటాడు. నవదీప్ మాత్రం గంటకు 150 కి.మీ. వేగంతో బంతులను సంధించగలడు.ఐపీఎల్ లో సైని విసిరిన ఓ బంతి వేగం గంటకు 152 కిలోమీటర్లుగా నమోదైంది.
26 ఏళ్ల సైని స్వస్థలం హర్యానాలోని కర్నాల్. జాతీయ జట్టులో ఆడాలనె అతని కోరిక నెరవేరింది. తమ ప్రాంతంలో చిన్నచితకా టోర్నమెంట్లు ఆడుతూ మ్యాచ్ కు రూ.200 పారితోషికం తీసుకునేవాడు. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఈ హర్యానా యువకుడిలో ఉన్న టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహించాడు. ఢిల్లీ జట్టులో వరుసగా అవకాశాలు కల్పించి జాతీయస్థాయిలో సైని అంటే ఓ గుర్తింపు లభించేలా చేశాడు.
2017-18 రంజీ ట్రోఫీలో ఎనిమిది మ్యాచుల్లోనే 34 వికెట్లు పడగొట్టి అందరి దృష్టి ఆకర్షించాడు. ప్రపంచకప్లో నెట్ బౌలర్గా భారత జట్టుకు సేవలు అందించాడు. తన జీవితాన్ని గంభీర్ మార్చేశాడని, అతను గంభీర్కు ఎప్పుడూ రుణపడి ఉంటానని చాలా సందర్భాల్లో గంభీర్ను కొనియాడిన సంగతి తెలిసిందే.