టీమిండియాతో వన్డేసిరీస్ను కోల్పోయిన న్యూజిలాండ్ టీ20లపై దృష్టి పెట్టింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా వరుసగా మూడు వన్డేలు గెలిచిన కోహ్లీసేన సిరీస్ను కైవసం చేసుకుంది. ఫిబ్రవరి 6 నుంచి జరగనున్న మూడు టీ20ల సిరీస్ కోసం న్యూజిలాండ్ సెలక్టర్లు 14 మందితో కూడిన జట్టుని తాజాగా ప్రకటించారు.
వరుస మూడు వన్డేల్లో న్యూజిలాండ్ చిత్తుగా ఓడిన..నేపథ్యంలో సీనియర్లతో పాటు యువ క్రికెటర్లకీ టీ20 జట్టులో చోటిచ్చిన సెలక్టర్లు.. కనీసం ఈ సిరీస్లోనైనా గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని ఆశిస్తున్నారు. టీ20 జట్టులో యువ హిట్టర్ డారీ మిచెల్, బ్లెయిర్ టిక్నెర్ రూపంలో ఇద్దరు కొత్త ఆటగాళ్లకి ఛాన్సిచ్చిన న్యూజిలాండ్ సెలక్టర్లు.. సీనియర్ ఆటగాడు లూకీ ఫర్గూసన్ని మాత్రం తొలి రెండు టీ20లకి మాత్రమే అవకాశమిచ్చారు.
మూడో టీ20లో అతని స్థానంలో టిక్నెర్ ఆడనున్నాడు. ఇటీవల జరిగిన ఓ టీ20 మ్యాచ్లో చెలరేగిన మిచెల్ కేవలం 23 బంతుల్లోనే 61 పరుగులతో సత్తాచాటాడు.
న్యూజిలాండ్ టీ20 జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), బ్రాస్వెల్, గ్రాండ్హోమ్, లూకీ ఫర్గూసన్ (రెండు టీ20లకి మాత్రమే), మార్టిన్ గప్తిల్, స్కాట్, డారీ మిచెల్, కొలిన్ మున్రో, మిచెల్ శాంట్నర్, టిమ్ సైపెర్ట్ (వికెట్ కీపర్), ఇస్ సోధి, టిమ్ సౌథీ, రాస్ టేలర్, టిక్నర్ (మూడో టీ20కి మాత్రమే)