అంటిగ్వాలో జరగుతున్న మొదటి టెస్ట్ లో విండీస్ బౌలర్లు తమ సత్తా చాటారు. నిప్పులు చెరిగే బంతులతో టీమిండియాను బెంబేలెత్తించారు. టీట్వంటీ, వన్డే సిరీస్లలో దుమ్మురేపిన టీమిండియా… టెస్టు సిరీస్లో మాత్రం అభిమానుల అంచనాల్ని అందుకోలేక పోయింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తమ కెప్టెన్ హోల్డర్ నిర్ణయానికి న్యాయం చేస్తూ… భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5) సహా ప్రధాన బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా (2), కెప్టెన్ విరాట్ కోహ్లి (9)లను త్వరత్వరగా పెవిలియన్ చేర్చా రు. 7 రన్స్కే రెండు వికెట్లు కోల్పోయి… అభిమానుల్లో మ్యాచ్ టెన్షన్ పెంచుతున్న సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ… బరిలో దిగాడు. అతను దుమ్మురేపుతాడనీ, భారీ స్కోర్ చేస్తాడనీ… అనుకున్నారు ఫాన్స్. కాని కోహ్లీ కూడా బ్యాటింగ్ లో నిరాశ పరిచారు.
తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రహానె, రాహుల్ టీమిండియాను ఆదుకున్నారు.రాహుల్ (97 బంతుల్లో 44; 5 ఫోర్లు), రహానే (122 బంతుల్లో 81; 10 ఫోర్లు) ఓపికతో ఆడి ఇన్నింగ్స్ను నిలబెట్టారు.117 బంతుల్లో రహానే అర్ధసెంచరీ పూర్తయింది.రహానేకు విహారి (56 బంతుల్లో 32; 2 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. అయితే వీరిద్దరూ భారీ స్కోర్లు నమోదు చేయడంలో విఫలమయ్యారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 68.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజ్ లో రిషభ్ పంత్(41 బంతుల్లో 20 బ్యాటింగ్; 4ఫోర్లు), రవీంద్ర జడేజా(3 బ్యాటింగ్)లు క్రీజులో ఉన్నారు. వీరిద్దరి పైనె జట్టు భారం పడింది. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు కీమర్ రోచ్ మూడు, గాబ్రిల్ రెండు వికెట్లు పడగొట్టారు.