పుణేలోని బ్రాబౌర్న్ స్టేడియంలో సోమవారం వెస్టిండీస్తో జరిగి మ్యాచ్లో రోహిత్ శర్మ (162), అంబటి రాయుడు (100) సెంచరీలతో అదరగొట్టారు. దీంతో భారత్ 224 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 211 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాచ్ విజయంలో వీరి భాగస్వామ్యం కీలక పాత్ర పోషించింది.
గత కొంతకాలంగా విపరీతంగా చర్చకు కారణమైన నాలుగో స్థానంలో వచ్చిన అంబటి రాయుడు చక్కగా రాణించాడు. రాయుడు బ్యాటింగ్ను వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసించాడు. రాయుడికి అండగా నిలిచాడు. ‘ప్రపంచ కప్ వరకు ఇక ఎవరూ నాలుగో స్థానం గురించి మాట్లాడరని అనుకుంటున్నాను. నం.4పై ఉన్న అనుమానాలన్నింటినీ రాయుడు తొలగించాడు. ఒత్తిడిలో అతను ఆడిన తీరు అద్భుతం. అతను మొదట నాతో భాగస్వామ్యాన్ని ఏర్పరిచాడు. 50 పరుగులు పూర్తిచేసిన తరవాత షాట్స్ ఆడటం మొదలుపెట్టా డని రోహిత్ ప్రశంసించాడు.
ఇక కెప్టెన్ కోహ్లీ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. అంబటి రాయుడు ఒక తెలివైన బ్యాట్స్మన్ అని కోహ్లి కొనియాడాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడిన కోహ్లి.. అతనికి తమ మద్దతు అవసరమని పేర్కొన్నాడు. ప్రధానంగా నాల్గో స్థానంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన రాయుడి బ్యాటింగ్పై టీమిండియా మేనేజ్మెంట్ చాలా సంతోషంగా ఉందన్నాడు. ‘ వచ్చిన అవకాశాన్ని రాయుడు రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు.
2019 వరల్డ్కప్ వరకూ సాధ్యమైనన్ని మ్యాచ్లు ఆడే అవకాశాన్ని అతనికి కల్పిస్తాం. రాయుడు గేమ్ను అర్ధం చేసుకునే తీరు నిజంగా అమోఘం. నాల్గో స్థానంలో అతను బ్యాటింగ్ చేసిన విధానంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం’ అని కోహ్లి పేర్కొన్నాడు.