భారత్, వెస్టిండీస్ మధ్య ఈనెల 24న జరగనున్న రెండో వన్డేకి ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని అనూహ్యంగా చేజిక్కించుకున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఇప్పుడు ఆ వన్డేని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ప్రేక్షకుల్ని పెద్ద ఎత్తున విశాఖపట్నం స్టేడియానికి రప్పించేందుకు మ్యాచ్ టికెట్ల ధరని భారీగా తగ్గించింది. వాస్తవానికి ఈ వన్డే ఇండోర్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ.. కాంప్లిమెంటరీ పాస్ల విషయంలో బీసీసీఐ, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) మధ్య వివాదం చెలరేగడంతో.. ఆ అవకాశాన్ని వైజాగ్ చేజిక్కించుకుంది.
ఈ మ్యాచ్కు సంబంధించి టికెట్ల విక్రయం ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. స్టేడియం సామర్థ్యం 28 వేలు కాగా, ఇందులో 90 శాతం టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు నిర్వాహక కమిటీ చైర్మన్, పోర్టు ట్రస్టు చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు విలేకరులకు తెలిపారు.
ఈవెంట్స్ నౌ డాట్ కామ్ ఆన్లైన్లో టికెట్ల విక్రయాన్ని చేపట్టనుంది. దీంతో పాటు విశాఖలోని పది కేంద్రాల్లో ఆఫ్లైన్లోనూ టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. టికెట్ల కొనుగోలుకు ఎటువంటి ఆధార్ లింక్ అవసరం లేదన్నారు.
రెండో వన్డే కోసం రూ. 6,000 ఉన్న టికెట్ ధరని రూ. 4,000 తగ్గించిన ఏసీఏ.. రూ. 3,500 ఉన్న వాటిని రూ.2,500కి, 2,500 ఉన్న వాటిని రూ.2,000కే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు రూ. 1,800, 1,200, 750, 250 టికెట్లని కూడా అందుబాటులో ఉంచింది.