ముంబై వేదికగా జరిగిన నాల్గో వన్డేలో వెస్టిండీస్ పై 224 పరుగుల తేడాతో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. భారత్ బౌలర్ల ధాటికి 36.2 ఓవర్లకే అన్ని వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు 153 పరుగులకే కుప్ప కూలింది. విండీస్ ప్లేయర్స్ లో కెప్టెన్ హోల్డర్ ఒక్కడే హాఫ్ సెంచరి చేశాడు. మిగిలిన ప్లేయర్స్ అందరూ చేతులెత్తేశారు. ఈ విజయంతో 5 వన్డేల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన ఓపెనర్ రోహిత్ శర్మ (162: 137 బంతుల్లో 20×4, 4×6), మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు (100: 81 బంతుల్లో 8×4, 4×6) శతకాల మోత మోగించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది.
378 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు స్కోరు 20 పరుగుల వద్ద ఓపెనర్లు హెమరాజ్, పావెల్ సహా వన్డౌన్ ప్లేయర్ షై హోప్(0) వికెట్లు కోల్పోవడంతో విండీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.20 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన విండీస్.. అదే పరుగు వద్ద మరో రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
షై హోప్ లేని పరుగు కోసం ప్రయత్నించగా.. ఫీల్డర్ కుల్దీప్ యాదవ్ కళ్లు చెదిరే రీతిలో బంతిని నేరుగా వికెట్లపైకి విసిరి రనౌట్ చేశాడు. తర్వాత ఓవర్లో తడబాటు కారణంగా ఓపెనర్ పొవెల్ కూడా రనౌటయ్యాడు. మరో కీలక ఆటగాడు హిట్ మెయిర్ భారత యువ సంచలనం ఖలీల్ అహ్మద్కు వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. భారత బౌలర్లు ఏదశలోనూ విండీస్కు అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన బౌలింగ్ వేశారు.
ఖలీల్ 5 ఓవర్లలో 3 వికెట్లు తీసి 13 పరుగులిచ్చాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో హిట్ మెయిర్(13)ను, 12వ ఓవర్లో పావెల్(1)ను, 14వ ఓవర్లో శామ్యూల్స్ (18)ను ఖలీల్ పెవిలియన్ బాట పట్టించాడు. భారత బౌలర్లు ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది