వరుస విజయాలతో జోష్ మీదున్న టీమ్ ఇండియాకు కీవిస్ జట్టు భారీ షాక్ ఇచ్చింది. తొలి మూడు వన్డేలు ఆడుతుపాడుతూ గెలిచిన టీమిండియా నాలుగో మ్యాచ్లో మాత్రం ఘోరంగా తడబడింది. హామిల్టన్ పిచ్పై కివీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్(5/21), గ్రాండ్ హోమ్(3/13) పదునైన బౌలింగ్కు భారత బ్యాట్స్మెన్ విలవిల్లాడారు. కివీస్ బౌలర్ల ధాటికి కనీస గౌరవప్రదమైన స్కోర్ నమోదు చేయకుండానే 30.5 ఓవర్లలో కేవలం 92 పరుగులకే ప్యాకప్ అయింది. పాండ్యా(16) చహల్(18), కుల్దీప్(15)లు చివర్లో రాణించడంతో ఆమాత్రం స్కోరయినా టీమిండియా సాధించగలిగింది. తొమ్మిదేళ్ల అనంతరం అత్యల్ప స్కోర్కు ఆలౌటై చెత్త రికార్డును నెలకొల్పింది. అది కూడా 2010లో దంబుల్లా వేదికగా న్యూజిలాండ్(88) పైనే ఈ రికార్డు ఉంది.
విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇవ్వడంతో కివీస్తో జరుగుతున్న నాలుగవ వన్డేకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించాడు. 200వ వన్డే ఆడుతున్న రోహిత్కు .. హామిల్టన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఓ దశలో క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్కే టీమిండియా ఆలౌటవుతుందా అనే అనుమానాన్ని బ్యాట్స్మెన్ కలిగించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు తొలి 5 ఓవర్లు మాత్రమే ఆనందాన్ని కలిగించాయి. కివీస్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో ధావన్ (13) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా.. రోహిత్ శర్మ, ధావన్ నుంచి మొదలుపెడితే ఒక్క బ్యాట్స్మెన్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేదు. దీంతో 92 పరుగులకే ఆలౌటై.. ఘోర అవమానాన్ని తన ఖాతాలో వేసుకుంది.