ఐపీఎల్-11లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మరో షాక్ తగిలింది. ఇప్పటికే కావేరి బోర్డు సెగతో తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలను నిర్వహించిన సంగతి తెలిసిందే. మ్యాచ్లను నిర్వహిస్తే అడ్డుకుంటామంటూ ఆందోళన కారులు హెచ్చరించడంతో మ్యాచ్లన్నీ పూణెకు తరలించారు.
పూణెలోకూడా చెన్నై సూపర్కింగ్స్ జట్టుకు జలగండం తప్పేట్లేదు. పుణె వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం వినియోగించే నీటిని ఎలా సమకూర్చుకుంటున్నారో తమకు వివరణ ఇవ్వాలని శుక్రవారం మహారాష్ట్ర క్రికెట్ సంఘం(ఎంసీఏ)కు కోర్టు నోటీసులు పంపించింది.
చెన్నైలో నిర్వహించాల్సిన మ్యాచ్లను పుణెలో నిర్వహిస్తామని చెన్నై యాజమాన్యం, ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా తెలిపిన మరుసటి రోజే కోర్టు నోటీసులు పంపడం గమనార్హం. నోటీసులపై ఏప్రిల్ 18లోగా సమాధానం చెప్పాలని గడువు విధించింది. మ్యాచ్ల కోసం పిచ్ను తయారుచేసేందుకు లక్షలాది లీటర్ల నీటిని ఉపయోగిస్తారు.