ఐపీఎల్ పదకొండో సీజన్ సూపర్ హిట్టయ్యింది. రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసిన ధోనీ సేన కప్ గెలవడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి వచ్చే ఐపీఎల్పైనే పడింది. వచ్చే ఏడాది ఐపీఎల్ మనదేశంలో జరుగతుందా అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి.
ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు, వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ను ఎక్కడ నిర్వహిస్తారు, షెడ్యూల్ ఎలా ఉండనుందనే అంశం ఆసక్తి రేపుతోంది. ఐపీఎల్ 2019 పండుగ ముందే రానున్నట్టు సమాచారం. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2019 ప్రారంభం కానుందని తెలుస్తోంది.
గత ఏడాది కంటే ఈసారి ఐపీఎల్ కొద్ది రోజులు ముందే ఆరంభం కాగా, వచ్చే ఏడాది మరో వారం ముందే ప్రారంభం కానుందన్న మాట. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వచ్చే సీజన్ ఐపీఎల్ను పూర్తిగా లేదా పాక్షికంగా విదేశాల్లో నిర్వహించే వీలుంది.
ఎన్నికల కారణంగా 2009లో ఐపీఎల్ను పూర్తిగా దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2014లోనూ తొలి 19 రోజులపాటు ఐపీఎల్ మ్యాచ్లకు యూఏఈ ఆతిథ్యం ఇచ్చింది. ఈ సారి ముందస్తు ఎన్నిలకు వెల్లాలని మోదీ యోచిస్తున్నట్లు సమాచారం.
అదే నిజమైతే.. వేసవిలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్లకు భద్రత కల్పించడం పెద్ద సమస్య కాబోదు. కాబట్టి మ్యాచ్లను వేరే దేశానికి తరలించాల్సిన అవసరం ఉండదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగితే మాత్రం బీసీసీఐ మ్యాచ్లను తరలించాల్సిందే.