ఐపీఎల్ ఆడే అవకాశం వస్తుందని అనుకోలేదంటున్నాడు తమిళనాడు ఆటగాడు సంజయ్ సింగ్ యాదవ్. ఉత్తర ప్రదేశ్ నుండి బతుకుతెరువు కోసం తమిళనాడులోని సంజయ్ కుటుంబసభ్యులు వచ్చారు. రోజువారి కూలీ కొడుకును అయిన తాను ఈ స్థాయికి చేరుకోవడంపై హర్షం వ్యక్తంచేశాడు.ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న రామ్ సింగ్ కు కొడుకును క్రికెట్ అకాడమీ చేర్పించడం కూడా ఓ కలలాంటిదే.
బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ తనది ఎడమచేతి వాటం అని సంజయ్ తెలిపాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో ఆడబోతున్నందుక ఎంతో సంతోషంగా ఉందన్నాడు. టీఎస్ సీఎల్ లో వీబీ తిరువళ్లూర్ తరఫున ఆడేవాడిని. అందులో తన ప్రదర్శనతో తమిళనాడు ట్వంటీ20లకు ఎంపికయ్యాను. ప్రస్తుతం కేకేఆర్ ఫ్రాంచైజీ రూ.10 లక్షల కాంట్రాక్టుతో నన్ను జట్టులోకి తీసుకుంది. కేకేఆర్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ బౌలింగ్ కిటుకులు నేర్చుకుంటున్నాను. ఎంతో మంది అంతర్జాతీయ ఆటగాళ్ల నైపుణ్యాన్ని చాలా దగ్గర నుంచి గమనించే చాన్స్ దక్కింది.
విరాట్ కోహ్లీ, అశ్విన్, షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్ లు తన అభిమాన క్రికెటర్లు’ అని సంజయ్ యాదవ్ తెలిపాడు. సంజయ్ చాలా పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన క్రికెటర్. కోచింగ్ కు డబ్బులేక ఇబ్బందులు పడుతుంటే ఫ్యూచర్ ఇండియా క్రికెట్ అకాడమీ కోచ్ ప్రేమ్ నాథ్.. సంజయ్ కి అండగా నిలిచాడు. సంజయ్ ఆటతీరును, నైపుణ్యాన్ని గుర్తించిన ప్రేమ్ నాథ్ సంజయ్ నుంచి ఎలాంటి ఫీజు ఆశించకుండానే కోచింగ్ ఇచ్చాడు.