- Advertisement -
కోహ్లి, డివిలియర్స్, మెక్కల్లమ్ లాంటి అగ్రశ్రేణి బ్యాట్స్మెన్.. సౌథీ, ఉమేశ్ యాదవ్ లాంటి టాప్ క్లాస్ బౌలర్లు ఉన్న ఆర్సీబీ తలరాత ఏమాత్రం మారడంలేదు. పది మ్యాచ్లు ఆడితే ఏడింట్లో ఓడింది. ప్రతి మ్యాచ్ను గెలవాలనే కసితో బరిలో దిగే కోహ్లి లాంటి కెప్టెన్కు ఈ స్థాయి పరాజయాలు అస్సలు నచ్చవు. ముఖ్యంగా సోమవారం రాత్రి హైదరాబాద్లో సన్రైజర్స్పై ఆ జట్టు ఓడిన తీరు ఘోరం. 147 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో తొలి ఏడు ఓవర్లలో 60 పరుగులు చేసినా ఆ జట్టు చివరకు విజయానికి 6 పరుగుల దూరంలో నిలిచింది.
గత రాత్రి ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ పోరులో ఓడిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, ప్లే ఆఫ్ కు దూరం కాగా, ఇదే మ్యాచ్ లో మరోసారి స్వల్ప స్కోరును కాపాడుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 16 పాయింట్లను సాధించి ప్లే ఆఫ్ కు దాదాపు అర్హత సాధించింది.
ఓటమిపై ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. చేతిలో నాలుగు వికెట్లు ఉంచుకుని కూడా 5 పరుగులు సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. టోర్నీలో తమ జట్టుది దీనగాథని వ్యాఖ్యానించిన కోహ్లీ, చెత్త షాట్లు ఆడి వికెట్లను పారేసుకున్నామని, పిచ్ చాలా స్లోగా ఉందని అన్నాడు. కాస్తంత కుదురుగా ఆడితే, పరుగులు సులువుగా సాధించవచ్చని మన్ దీప్, గ్రాండ్ హోమ్ ల జోడీ నిరూపించిందని అన్నాడు.
మ్యాచ్ను చేజేతులా పోగొట్టుకున్నాం. ఫీల్డింగ్ బాగా చేశాం. ఈ సీజన్కు ఇక ఇంతే. సన్రైజర్స్ ఆటగాళ్లకు తమ బలమేంటో, పరిమితులేంటో తెలుసు. తమ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే వారు ఆడతారు. పరిధి దాటరు. ఒత్తిడిలోనూ తమదైన ఆటతీరు కనబరుస్తారు. మా జట్టుకు సన్రైజర్స్కు అదే తేడా. టీంలో బలమైన ఆటగాళ్లుంటే టోర్నీలో ముందుకెళ్లొచ్చు. ఆల్రౌండ్ టీంగా చెన్నై, పంజాబ్ బాగున్నాయి. సన్రైజర్స్ బౌలింగ్ పటిష్టంగా ఉందని కోహ్లి చెప్పాడు.
బౌలర్లు కనీసం 10 నుంచి 15 పరుగులు తక్కువగా ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలిచిందని చెప్పడం కన్నా, తాము చేజేతులా ఓడిపోయామని అనడం సబబని వ్యాఖ్యానించాడు.