దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది భారత్. దీంతో భారత జట్టుపై అన్ని వర్గాలనుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వదేశంలో మంచి ఫామ్ కనడరిచిన బ్యాట్స్మేన్లు దక్షిణాఫ్రకా ఫేస్పిచ్లమీద తేలిపోతున్నారు. సఫారీలతో మొదటి టెస్టులో స్థానం కల్పించిన ధావన్, రోహిత్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో ఇప్పుడు వారిమీద కూడా విమర్శలు వస్తున్నాయి.
మొదటి టెస్ట్లోని వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని భారత్.. శనివారం నుంచి జరగనున్న రెండో టెస్టుకి జట్టులో మార్పులు చేయాలని భావిస్తోంది. సెంచూరియన్ వేదికగా శనివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది.
తొలి టెస్టులో బౌలర్లు సత్తాచాటినా.. బ్యాట్స్మెన్ మాత్రం చేతులెత్తేశారు. ముఖ్యంగా 208 పరుగుల లక్ష్య ఛేదనలో ఏ మాత్రం పోరాట పటిమ చూపలేకపోయారు. దీంతో 72 పరుగుల తేడాతో సఫారీ జట్టు అలవోకగా గెలుపొందింది.
టెస్టుల నుంచి భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సుదీర్ఘకాలం టెస్టు జట్టులో వికెట్ కీపర్గా ఉంటున్న సాహా.. తొలి టెస్టులో ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 8 బంతులు ఎదుర్కొని డకౌటైన సాహా.. రెండో ఇన్నింగ్స్లోనూ కీలక సమయంలో 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు.
దీంతో అతని స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్కు ఛాన్సివ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో పార్థీవ్ పటేల్ చాలాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. 2016లో చివరిసారి పార్థీవ్ పటేల్ భారత్ తరఫున మ్యాచ్లు ఆడాడు. మరో వైపు కేఎల్ రాహుల్, రహానేలలో ఎవరికో ఒకరికి చోటు దక్కవచ్చు.