నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజేతగా నిలిచారు. నోముల భగత్ 19,281 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా 9 రౌండ్ల వరకు భగత్ దూకుడు కొనసాగింది. 10, 11, 14వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మళ్లీ మిగతా అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ పార్టీ దూకుడు ప్రదర్శించింది. కారు వేగానికి హస్తం, కమలం పార్టీలు తుడిచి పెట్టుకుపోయాయి.
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సింహయ్య కేవలం 7,771 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలుపొందారు. నాటి ఎన్నికల్లో నర్సింహయ్యకు 83 వేల ఓట్లు రాగా, తాజాగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు భగత్కు 87 వేల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో జానారెడ్డి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. తండ్రి కంటే భారీ మెజార్టీ సాధించిన భగత్కు పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక నోముల భగత్కు సర్వత్రా శుభాకాంక్షలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
పార్టీ విజయాన్ని తెలంగాణ భవన్లో స్వీట్లు పంచుకోవడం, పటాకులు కాల్చడం ద్వారా నాయకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ నోముల భగత్ శుభాకాంక్షలు తెలిపారు.
తిరుపతిలో గురుమూర్తి ఘనవిజయం..