దేశంలో కరోనా వైరస్ ప్రబలిపోతున్న సమయంలో సినీ ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో నటులు, సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. కన్నడ సీనియర్ నటుడు సురేష్ చంద్ర కరోనాతో కన్నుమూశారు. బెంగుళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
కరోనాతో గత వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. కానీ వైద్యానికి సరిగా స్పందించకపోవడంతో మరణించారు. కాగా సురేశ్ చంద్రకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన కెరీర్లో 50కి పైగా కన్నడ చిత్రాల్లో నటించారు సురేష్ చంద్ర. విలన్ పాత్రలకు పేరుగాంచిన సురేష్ నటుడిగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు.
చెలువినా చిత్తారా, ఉగ్రమ్ వంటి కన్నడ చిత్రాలలో విలన్ గా నటించి ప్రేక్షకులకు ఆకట్టుకున్నారు. కిచా హుచ్చా, రానా, షైలూ, కాళిదాస కన్నడ మేష్త్రు, అప్పయ్య, జంగ్లీ వంటి పలు హిట్ చిత్రాలలో కూడా నటించారు. ఆయన చివరిసారిగా 2019లో ‘కాళిదాస కన్నడ మేష్త్రు’ అనే చిత్రంలో కన్పించారు. ఆయన మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.