ఇటీవల తెలుగుదేశం పార్టీ వారు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, మంత్రులకు ర్యాంకులు ఇచ్చుకొన్నారు. రాష్ట్ర స్థాయిలో.. జిల్లా స్థాయిలో వారు ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చారు.
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ర్యాంకులు ఇచ్చారు. మరి ఇలాంటి ర్యాంకుల్లో సాధారణంగా తెలుగుదేశం వారు స్వార్థఫూరితంగా వ్యవహరించి ఉండే అవకాశం ఉంది. టాప్ ర్యాంకులు అన్నీ తమ పార్టీ వాళ్లకే ఇచ్చుకొనే అవకాశం కూడా లేకపోలేదు.
మరి ఇలాంటి ర్యాంకింగ్ లో టాప్ టెన్ లో ఒకడిగా నిలిచాడు నందమూరి నటసింహం. బాలయ్య టాప్ టెన్ ర్యాంకుల్లో ఒకదాన్ని సొంతం చేసుకొన్నాడు. అలాగే అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య ఆ జిల్లా వరకూ టాప్ పొజిషన్ ను సొంతం చేసుకొన్నాడు. మిగతా ఎమ్మెల్యేలందరి కన్నా బాలయ్య చాలా బాగా పనిచేస్తున్నాడంటూ తెలుగుదేశం వారు ఆయనకు ఫస్ట్ ర్యాంకును ఇచ్చారు.
మరి అప్పట్లోనే దీనిపై జోకులు పడ్డాయి. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. తాజాగా నందమూరి నటసింహాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు నిలదీశారు. నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన ఆయనను అడ్డుకొని కొంతమంది మహిళలు తమ సమస్యల గురించి ప్రశ్నించారు. మొదట వారి అటకాయింపుతో ఇబ్బంది పడి.. ఏం మాట్లాడాలో కూడా తెలియనట్టుగా కనిపించిన బాలయ్య చివరకు రెండు నెలలు వెయిట్ చేయాలని.. తర్వాత వారి సమస్యలను ప్రరిష్కరిస్తానని ప్రకటించాడు. మరి నంబర్ వన్ ర్యాంకర్ అయిన బాలయ్యకే ఇలాంటి అటకాయింపులు తప్పకపోవడం ఏమిటో!