చంద్రబాబుపై చీరాల టీడీపీఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం ప్యామిలీతో కలసి వైఎస్ జగన్ను కలిసిన అనంతరం త్వరలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి ఒక్క జగన్తోనే సాధ్యమన్నారు. రాష్ట్రవిభజన తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైనే చర్చించామన్నారు. మూడున్నర సంవత్సరాల పాటు పార్టీలో తనకు వ్యతిరేకంగా జరిగిన పరిణామాలు తనను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయని, కార్యకర్తల సూచన మేరకు టీడీపీకి రాజీనామా చేసినట్లు ఆమంచి వెల్లడించారు.
బాబు పూటకో మాట మాట్లాడుతున్నారని మండి పడ్డారు. చంద్రబాబు నాయుడు మాటలు చూస్తే పిచ్చి పట్టినట్లు ఉందని, ఆయనకు 70 ఏళ్లు దాటయాని, అల్జీమర్స్ వచ్చిందనే అనుమానం కలుగుతుందన్నారు. ఈ రోజు ఒకమాట చెప్పి, రోజు మరో మాట చెబుతారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని కొన్ని అతీంద్రీయ శక్తులు నడిపిస్తున్నాయని ఆరోపించారు. పార్టీతో సంబంధం లేని వాల్లు బాబును కలుస్తున్నారని…నాకు మాత్రం కలిసే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో పార్టీ పరంగా నాయకులు అనేక ఇబ్బందులు కలిగించారని, ఈ అంశాలన్నీ చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. కాని ఆయననుంచి ఎలాంటి స్పందనలేదన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా సీఎం నివాసంలో, ఆయన పేషీలో ఇతర వ్యక్తులు జోక్యం చేసుకున్నారని మండిపడ్డారు.
పవన్ను కలిసిన మాట వాస్తవమేనని అయితే….పార్టీలో చేరమని నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీతరుపున చీరాలనుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని..తనపై టీడీపీనుంచి ఎవరు పోటీ చేసినా తాను పట్టించుకోనన్నారు. తనతో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు, నాయకులు వైసీపీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని మరో బాంబు పేల్చారు. 2014లో కేవలం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయుడుకే ఓటేశారన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు చెల్లించకుండా టీడీపీ ప్రభుత్వం కొత్త కొత్త పథకాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తన వ్యక్తిగత కారణాల కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ను వదిలి ఏపీకి వచ్చారని ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు. అసలు హైదరాబాద్ నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది. అమరావతిలో ఉద్యోగులకు కనీసం మంచినీళ్లు, కూర్చోడానికి చెట్ల నీడ కూడా లేదు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని చెప్పారు. పార్టీని వీడే ముందు మాజీ సీఎం రోశయ్య ఆశ్వీసులు తీసుకున్నానన్నారు.