సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి ఆశయాలకు అనుగునంగా పాలన కొనసాగిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.వై.ఎస్ హయాంలో నిర్వహించ తలపెట్టిన రచ్చబండ కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు.నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి, చిత్తూరు జిల్లాలో తాను అనుకున్న ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని బయలుదేరి, నల్లమల అడవుల్లో ఘోర ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే.
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనె మ్యానిఫెస్టోలో ఇచ్చిన చాలా అంశాలను అమలు చేశారు జగన్. ప్రభుత్వ పథకాలు అట్టడుగున ఉన్న ప్రజలకు అందుతున్నాయే లేదో తెలుసుకొనేదానికి తండ్రి ప్రారంభించిన ఆగిపోయిన రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
వైఎస్ కన్నుమూసిన రోజయిన సెప్టెంబర్ 2వ తేదీనే ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం జగన్ అమెరికాలో ఉండగా, ఆయన తిరిగి రాగానే పర్యటన షెడ్యూల్ ఖరారవుతుందని సమాచారం. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా తొలిసారి జగన్ ప్రజల్లోకి వెళ్లినట్టు అవుతుంది. తన పాదయాత్రలో భాగంగా కోట్లాదిమందిని దగ్గర నుంచి చూసిన జగన్, వారి సమస్యలను మరింత లోతుగా చర్చించేందుకు రచ్చబండను వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు పార్టీ నేతలు అంటున్నారు.
ప్రభుత్వ పథకాల అమలు తీరు, గ్రామ వలంటీర్ల వ్యవస్థ విధానం, గ్రామ వలంటీర్ల విధి విధానాలతో పాటు ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి నుంచి వైఎస్ జగన్ అభిప్రాయాలను సేకరించేందుకు సిద్దమవుతున్నారు.ఈ కార్యక్రమం అన్ని జిల్లాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో కొనసాగుతుందని సమాచారం.