యువ కథానాయకుడు పహజ నటుడు నాని మంచి జోరుమీదున్నారు. ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన ఇటీవలే ‘ఎం.సి.ఎ.’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా వాల్పోస్టర్ బ్యానర్ పేరుతో నాని నిర్మాతగా అవతారం ఎత్తి ‘అ!’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఇందులో నాని ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంతవర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ‘అ!’ చిత్రంలో కనిపించనున్న చేప ఫొటోను అభిమానులతో నాని షేర్ చేసుకున్నారు ‘పరోపకారం చేసే చేపగా ‘అ!’లో నేచురల్స్టార్ నాని’ అనే పోస్టర్ను పంచుకుంటూ.. ‘నా తర్వాతి చిత్రంలో ఓ ఆసక్తికర పాత్రను పోషిస్తున్నా. స్క్రిప్ట్ డిమాండ్ చేయటంతో ఈదడం నేర్చుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
‘అ!’ చిత్రంలో నిత్యామేనన్, కాజల్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చేపతో పాటు మరో ప్రాణి కూడా ఇందులో కనిపించనుంది. దానికి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.