జీనియస్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఈ విషయంపై తాజాగా నిర్మాత దిల్ రాజు ఓ అప్డేట్ ఇచ్చాడు. సెప్టెంబర్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే చాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు. నిన్న కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపిక జరుగుతోంది. కొరియో గ్రాఫర్గా జానీ మాస్టర్, మ్యూజిక్ డైరెక్టర్గా తమన్, మాటల రచయితగా బుర్రా సాయి మాధవ్ను ఇప్పటికే ఎంపిక చేశారు.ఇక హీరోయిన్ విషయంపై ఇంకా క్లారిటీ లేదు. రష్మిక, పూజాహెగ్డేల్లో ఎవరినో ఒకరిని ఎంపిక చేసే చాన్స్ ఉంది. ఇక బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి. శ్రద్ధా కపూర్ను తీసుకొనే చాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇంకా అధికారిక సమాచారం ఏదీ రాలేదు.
ప్రస్తుతం రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆచార్య తుది షెడ్యూల్లో చరణ్ పై డైరెక్టర్ కొరటాల శివ కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే ఆర్ ఆర్ఆర్ కు సంబంధించి ఎన్టీఆర్, చరణ్ ఇద్దరికి సంబంధించి ఓ పాటను చిత్రీకరించాల్సి ఉంది. దీని కోసం చిత్ర యూనిట్ జార్జియా కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. శంకర్ అన్ని విభాగాలకు టెక్నీషియన్లు ఎంపిక చేసే పనిలో ఉన్నారని, అది పూర్తయిన అనంతరం సెప్టెంబర్లో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే చాన్స్ ఉందని దిల్ రాజు ప్రకటించాడు.
Also Read
త్వరలో ఆర్ఆర్ఆర్ నుంచి ‘బీ హైండ్ ద సీన్స్’ .. !