నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి రక్తదానం చేశారు. అనంతరం తన ట్విట్టర్లో బ్లడ్ ఇచ్చే సమయంలో తీసిన ఫోటోని షేర్ చేస్తూ.. రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడుతున్న సోదర, సోదరీమణులను అభినందిస్తున్నాను. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం మనకు ఉందని ఆయన చెప్పారు. రక్తదానం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు.
చిన్న పనితో ప్రాణాలను కాపాడడం, ఏ సంబంధం లేనివారికి రక్తాన్ని ఇచ్చి రక్త సంబంధం ఏర్పరచుకోవడం గొప్ప అదృష్టం అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, చిరు బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా పరిస్థితుల్లో చిరు ఆక్సిజన్ బ్యాంకులను తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో నెలకొల్పాడు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పది రోజుల షూటింగ్ మిగిలి ఉంది. ఇది పూర్తైన తర్వాత లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరపుకోనుంది.